చెన్నై, ఏప్రిల్ 12 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల గాయం కారణంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ ఏకంగా ఈ సీజన్ కు దూరమైనా సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విజయాలతో మంచి ఊపుమీదున్న ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీ-20 మెరుపు వీరుడు సురేష్ రైనా గాయం కారణంగా తర్వాతి రెండు మ్యాచ్లకు దూరం అయ్యాడు. కోల్కత్తా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సునీల్ నరైన్ వేసిన 10వ ఓవర్లో సింగిల్ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది.దీంతో వచ్చే ఆదివారం(ఏప్రిల్ 15న) కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 20న రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లకు రైనా లేకుండానే సీఎస్కే బరిలోకి దిగనుంది. ప్రస్తుతం రెండు విజయాలతో సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రైనా దూరం కావడంతో అతని స్థానంలో మురళీ విజయ్ ఆడే అవకాశం ఉంది.