IPL 2020: వేలానికి వేళాయే!

SMTV Desk 2019-12-19 13:53:35  

ఐపీఎల్ 2020 సీజన్‌కి ఆటగాళ్ల వేలం కోల్‌కతా వేదికగా జరగనుంది. ఈ వేలం కోసం మొత్తం 997 మంది క్రికెటర్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకోగా.. జాబితాని బీసీసీఐ 332 మందికి కుదించింది. ఇందులో నుంచి ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి కేవలం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. ఈ 73 మంది క్రికెటర్లలో 23 మంది విదేశీ క్రికెటర్లు ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వేలం ప్రారంభంకానుంది. భారత్ నుంచి ఈ వేలంలో రూ. 1.5 కోట్ల కనీస ధరతో రాబిన్ ఉతప్ప ఉండగా.. పీయూస్ చావ్లా, యూసఫ్ పఠాన్, జయదేవ్ ఉనద్కత్ రూ. కోటి ధరతో వేలంలోకి వస్తున్నారు. ఇక రూ. 50 లక్షల కనీస ధరతో చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, స్టువర్ బిన్నీ, నమన్ ఓజా, మోహిత్ శర్మ, సౌరభ్ తివారి, మనోజ్ తివారి, రిషి ధావన్, బరిందర్ శరణ్ తదితరులు ఉన్నారు. గత ఏడాది పుజారాని ఏ ఫ్రాంఛైజీ వేలంలోకి కోనుగోలు చేయలేదు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో మాక్స్‌వెల్, క్రిస్‌లిన్, మిచెల్ మార్ష్, డేల్ స్టెయిన్, పాట్ కమిన్స్ తదితరులు ఉన్నారు. ఐపీఎల్‌లో ఒక్కో టీమ్‌లో గరిష్టంగా 25 మంది క్రికెటర్లు మాత్రమే ఉండాలనేది నిబంధన. ఇందులో 8 మంది విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. అయితే.. తుది జట్టు (ప్లేయింగ్ 11)లో మాత్రం నలుగురు విదేశీ క్రికెటర్లని మాత్రమే ఆడించాల్సి ఉంటుంది. వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 42.70 కోట్లు డబ్బు ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 11 మంది ఆటగాళ్లని తీసుకునే వెసులబాటు ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 17 కోట్లు ఉండగా.. ఏడుగుర్ని కొనుగోలు చేసే వీలుంది. ఇందులో ఇద్దరు విదేశీ క్రికెటర్లకి ఛాన్స్ దక్కనుంది. అత్యల్పంగా చెన్నై సూపర్ కింగ్స్‌ కేవలం ఐదుగురు ఆటగాళ్లని మాత్రమే వేలంలో కొనుగోలు చేసే వెసులబాటు ఉంది.