న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 : భారత్ లో నిర్వహించాల్సిన ఆసియా కప్ యూఏఈ వేదికగా జరగనుంది. సెప్టెంబరు 13నుంచి 28 వరకు ఈ టోర్నీ సందడి చేయనుంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ కప్ చివరగా 2016లో ప్రయోగాత్మకంగా టీ20 ఫార్మాట్లో జరిపారు. కానీ ఈ సారి వన్డే ఫార్మాట్లోనే టోర్నీ నిర్వహించనున్నారు. ఆసియా కప్ సమరంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లతో పాటు ఆసియా కప్ అర్హత టోర్నీ విజేత పాల్గొంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పాక్లో జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో ఆడేది లేదని ఇదివరకే భారత్ తేల్చి చెప్పింది. దీంతో తాము కూడా భారత్లో జ రిగే ఆసియా కప్లో తలపడేది లేదని పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ స్పష్టం చేశారు. దీంతో కౌలాలంపూర్లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో టోర్నీ వేదికలో మార్పు చేశారు.