న్యూఢిల్లీ, మార్చి 27: ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన 39 మంది భారతీయుల మృతదేహాలను వారం రోజుల్లో స్వదేశానికి తీసుకువస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాధిత కుటుంబాలతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. మృతదేహాలను తీసుకువచ్చేందుకు తమ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ ప్రత్యేక విమానంతో ఇరాక్ వెళ్లి మొత్తం లాంఛనాలను పూర్తి చేస్తారని సుష్మాతెలిపారు. బాధిత కుటుంబాలకు సాధ్యమైనన్ని విధాలుగా సహాయపడతామనీ, వీలుంటే కుటుంబాల్లో ఒకరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా సంబంధిత ముఖ్యమంత్రులతో మాట్లాడతామనీ మంత్రి హామీ ఇచ్చారు. కుటుంబాన్ని పోషించేవారే ప్రాణాలు కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామనీ, దాని దృష్ట్యా సాయం చేయాలనీ బాధిత కుటుంబాలు ఆమెను కోరాయి