బెంగళూరు, మార్చి 24 : విరాట్ కోహ్లి నేతృత్వంలో గల రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టులో మార్పు చోటు చేసుకుంది. ఐపీఎల్-11 సీజన్ కోసం బరిలోకి దిగనున్న ఈ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో కివీస్ ఆల్ రౌండర్ కోరె అండర్సన్ను తీసుకున్నట్లు ఐపీఎల్ టెక్నికల్ కమిటీ వెల్లడించింది. కౌల్టర్ నైల్ గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్సీబీ ఫ్రాంఛైజీ యాజమాన్యం తెలిపింది. ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా కోహ్లి నాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 8న కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.