చెన్నై, మార్చి 10 : సర్వీస్ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సినిమా హాల్ లు అన్ని మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు ఛార్జీలను కాస్త తగ్గించడంతో సినిమాలు యథావిధిగా ప్రదర్శిస్తున్నారు. కాని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్ ఇంకా కొనసాగుతోంది. ఆందోళనలను మరింత ఉధృతం చేసి మార్చి 16 నుంచి కొత్త సినిమా విడుదల మాత్రమే కాకుండా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయనున్నట్లు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్పీసీ) వెల్లడించింది. ఆరు డిమాండ్లతో టీఎఫ్పీసీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించనుంది. * ఆ ఆరు డిమాండ్ లు ఇవే.. 1. టికెట్ ధరలను సరళీకరించాలి. 2. ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలను తగ్గించాలి. 3. అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేయాలి. 4. క్యూబ్, యూఎఫ్వోలు ఇక నుంచి వర్చువల్ ప్రింట్ ఫీజును వసూలు చేయకూడదు. 5. ప్రొడక్షన్ వ్యయాన్ని నియంత్రించాలి. 6. చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.