న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పరీక్షలు.. ఈ పేరు చెబితే యావత్ భారత్ విద్యార్ధి లోకం ఒక రకమైన భయంతో వణుకుతుంది. ముఖ్యంగా మార్చి వచ్చిందంటే చాలు విద్యార్థులకు పరీక్షల ఫోబియా పట్టుకుంది. ప్రస్తుత సమాజం ర్యాంకుల వేటలో విద్యార్ధులను ఆటబొమ్మలుగా మార్చి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. బాగా చదివినప్పటికీ.. పరీక్ష రాసే సమయంలో అవి గుర్తు రాక విద్యార్థులు ఆందోళనకు లోనవుతారు. వాటి నుంచి ఎలా బయటపడాలో చెబుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పేరుతో పుస్తకాన్ని రచించారు. 208 పేజీలున్న ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. పది, పన్నెండో తరగతి విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని మోదీ గతంలో మన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ పుస్తకాన్ని శనివారం దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జావడేకర్ విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష భయం పోవాలంటే బృంద చర్చల్లో పాల్గొనాలని పుస్తకం ద్వారా సూచించారు. ఆయన అనుభవాలను ఉదాహరణగా చూపుతూ ఒత్తిడిని జయించే మార్గాల గురించి పుస్తకంలో చక్కగా వర్ణించారు.