గువహటి, జనవరి 20: దిల్లీ-గువహటి-ఇంఫాల్ ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం నుంచి బయట పడింది. 160 మందితో ప్రయాణిస్తున్న విమానం గువహటి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానానికి పక్షి తగిలింది. ఆ విమానంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా ఉన్నారు. తాను ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, గువహటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని బీరేన్ ట్వీట్ చేశారు. ఎయిరిండియా అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విమానాన్ని తమ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. గువహటి విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజ్మెంట్ అస్సలు బాగోలేవని బీరేన్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. చాలా మంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం వసతి ఏదీ లేదని అన్నారు. ముగ్గురు ఎయిరిండియా సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారని, శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం కూడా అందుబాటులో లేదని సంస్థ అధికారులు తెలిపినట్లు బీరేన్ వెల్లడించారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ఎయిరిండియా అన్ని విధాలా ప్రయత్నిస్తోందని సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.