న్యూఢిల్లీ, జనవరి 13 : గత తొమ్మిదేళ్లుగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై ఈడీ కేసు ఉన్నందున, నేడు కార్తీ చిదంబరం కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(ఈడీ) సోదాలు నిర్వహించారు. అధికారాలను దుర్వినియోగం చేసి ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థ విదేశీ పెట్టుబడులు పొందేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కార్తీ చిదంబరం, ఐఎన్ఎక్స్ మీడియా సంచాలకులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలపై ఈడీ కేసు నమోదు చేసింది. కార్తీ చిదంబరంపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట ఈనెల 16న హాజరుకావాల్సిందిగా ఆయనకు సమన్లు జారీ చేసిన రెండో రోజే దాడులు జరగడం గమనార్హం. గత నెలలో కూడా ఇదే విధంగా చిదంబరం బంధువుల ఇళ్లపై ఈ దాడులు నిర్వహించడం జరిగింది.