ముంబై, డిసెంబర్ 27 : ఇటలీలోని టస్కనీలో ఈ నెల 11న కుటుంబ సభ్యుల మధ్య విరాట్ కోహ్లి, అనుష్క లు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ జోడీ నిన్న ముంబయిలోని సెయింట్ రెజిస్ హోటల్లో బాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల కోసం ఘనంగా విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తారా తోరణం హాజరై సందడి చేశారు. దేశంలో గల సినీ, క్రికెట్, క్రీడా దిగ్గజలందరూ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి రాగా, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ లు సతీ సమేతంగా విచ్చేశారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, ఏఆర్ రెహమాన్, శ్రీదేవి, రేఖ, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, లారా దత్తా, మహేష్ భూపతి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తదితరులు పాల్గొన్నారు. టీమ్ఇండియాలోని క్రికెట్ సభ్యులంతా ప్రత్యేక సూట్లతో ఆకట్టుకున్నారు. విరుష్క జోడీ పెళ్లి వేడుకలు మంగళవారం విందుతో ముగిశాయి. ఇక వీరి జంట నూతన సంవత్సర వేడుకలు దక్షిణాఫ్రికాలో జరుపుకోనున్నారు.