న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : డేరా సచ్ఛా ఆశ్రమ బాగోతలు తలపిస్తూ.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆధ్యాత్మిక గురువు వీరెంద్రదేవ్ దీక్షిత్ ఆశ్రమంలో వెలుగు చూసిన మహిళల అక్రమ నిర్బంధ వ్యవహారంలో, పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఆశ్రమంలో అక్రమ నిర్బంధనలో ఉన్న సుమారు 40 మంది మహిళలు, బాలికలను నిన్న రాత్రి విడిపించారు. ఇక్కడ మహిళలను జంతువుల తరహాలో బంధించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఔషధాలు, ఇంజెక్షన్లు వంటి చాలా సామాగ్రి దొరికినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ...ఆశ్రమంలో చాలా అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆశ్రమంలో అత్యాచారాలు, ఆత్మహత్యాయత్నాలపై ఢిల్లీ హైకోర్టు వద్ద నిర్దిష్టమైన ఫిర్యాదులు ఉన్నాయి. మహిళల అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందని కూడా స్థానికులు చెబుతున్నారు. మహిళల్ని తీసుకొని అర్ధరాత్రి వాహనాలు వస్తుంటాయని చెబుతున్నారు. ఇంకా ఈ ఆశ్రమంపై అనేక ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకే మేం ఇక్కడికి వచ్చామని ఆమె వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించగా, జనవరి 4వ తేదీ లోపు పరారిలో ఉన్నట్లు అనిమానిస్తున్నవీరేంద్ర దేవ్ ను పోలీసులు కోర్టుకు హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.