లక్నో, డిసెంబర్ 22 : ప్రస్తుత సమాజంలో సెల్ఫీ అందరి జీవితంలో భాగంగా మారిపోయింది. ఎవరైనా సెలబ్రిటీ, ఒక ప్రత్యేక స్థలం అనే తేడా లేకుండా సెల్ఫీ అంతటా విస్తరించింది. తాజాగా ఈ సెల్ఫీ సెగ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటిని తాకింది. లక్నోలోని కాళిదాస్ మార్గ్, రోడ్ నం.5లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ఉంది. తరుచు అదే పనిగా కొంత మంది యువకులు యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు సెల్ఫీ కోసం అక్కడి పోలీసు సిబ్బందితో గొడవపడుతున్నారు. దీని పై స్పందించిన భద్రత సిబ్బంది ఇకపై సెల్ఫీల కోసం రావొద్దని వస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటూ ప్రత్యేకంగా యోగి ఇంటి ముందు బ్యానర్ కట్టారు. ఈ విషయాన్ని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ చూసిన లక్నో అధికారులు వెంటనే బ్యానర్ ను తొలగించారు.