పనాజీ, డిసెంబర్ 19 : రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ డ్రగ్స్ విషయంపై తీసుకుంటున్న చర్యలేంటి.? అనే ప్రశ్నకు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్సింగ్ రాణే ప్రవేశపెట్టిన తీర్మానంపై పారికర్ స్పందిస్తూ.. "ఆల్కహాల్ తీసుకునేవారు కేవలం రెండు మూడు గంటల కంటే ఎక్కువ సేపు డ్యాన్స్ చేయలేరు. కాని డ్రగ్స్ తీసుకునేవారు రాత్రంతా డ్యాన్స్ చేయగలరు. గోవాలో రేవ్ పార్టీలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని అన్నారు. ఇటీవల కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, నైట్ పార్టీలలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. వాటిని గుర్తించి డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు.