న్యూ డిల్లీ, డిసెంబర్ 02: లంక బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకు పడుతూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ మ్యాచ్ అన్న సంగతి మరిచాడో ఏమో కానీ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వంద స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్నాడు. శ్రీలంక బౌలర్ గమగే వేసిన 37వ ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీకి తరలించి కోహ్లి అర్ధ శతకం పూర్తిచేశాడు. ఇందులో 11 ఫోర్లు ఉండడం విశేషం. కాగా విరాట్ మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అతని 105వ ఇన్నింగ్స్లో లక్మల్ వేసిన 30.3వ బంతిని బౌండరీకి తరలించి టెస్టుల్లో 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం 46 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 200 మార్కును చేరుకొని రెండు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి(74), విజయ్(77) ఉన్నారు.