న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : డిజిటల్ లావాదేవీల పెంపునకై కేంద్రప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఇకపై రైల్వే టికెట్లను "భీమ్, UPI" యాప్ ల ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని 14 వేల రిజర్వేషన్ కౌంటర్లలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ వ్యవస్థను అమలు చేస్తామని ప్రకటించింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదుకు బదులు "భీమ్" యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు. నోట్లు రద్దు తర్వాత రైలు టికెట్లు దాదాపు ఆన్లైన్లో బుక్ అయ్యేవి. కేవలం 30 శాతం మంది ప్రయాణికులు మాత్రమే నగదుతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం అదనపు ఛార్జీలు అవసరం లేదని, బుకింగ్ టికెట్ల కోసం QR కోడ్ ఎంపికను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.