కరాచీ, నవంబర్ 30 : అంతర్జాతీయ క్రికెట్ నుండి పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ సయీద్ అజ్మల్ బుధవారం వైదొలిగాడు. నేషనల్ టీ 20 చాంపియన్ షిప్లో భాగంగా బుధవారం ఫైసలాబాద్ తరపున అజ్మల్ చివరి మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ కు స్వస్తి పలికాడు. ఈ క్రమంలో అజ్మల్ ఐసీసీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఈ సందర్భంగా మాట్లాడుతూ " నా రిటైర్మెంట్ కారణం ఐసీసీ. ఎందుకంటే నా బౌలింగ్ నిబంధనలకు విరుద్దంగా ఉందని నాపై రెండు సార్లు వేటు వేశారు. ఈ సందర్భంగా నేను మీకు ఓ సవాల్ విసురుతున్న, ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బౌలర్లకు పరీక్ష నిర్వహించండి . అందులో దాదాపు 90శాతం మంది విఫలమవుతారు " అని అజ్మల్ అన్నారు అంతే కాకుండా దాదాపు ఆరేళ్ల క్రితం నాటి ఒక సంఘటనను అజ్మల్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయం పై స్పందిస్తూ "2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్-2లో మేము భారత్తో పోరాడుతున్నాము . ఆ మ్యాచ్లో సచిన్ 85 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా నిలిచాడు. కానీ నా బౌలింగ్లో సచిన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని" అజ్మల్ గత జ్ఞాపకాల్ని వివరించాడు.