జైపూర్, నవంబర్ 28 : జాతీయ గీతంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 789 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు రెసిడెన్షియల్ స్కూళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేసిన రాజస్థాన్ ప్రభుత్వం, తాజాగా ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు వసతి గృహంలోని విద్యార్థులచే జాతీయ గీతాలాపన చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సామాజిక న్యాయ, సాధికారత(ఎస్జేఈ) విభాగం పేర్కొంది.