మహిళా ఐపీఎల్ రాబోతుందా...?

SMTV Desk 2017-11-28 10:25:44  women ipl, vinod rai, mithali raj, julan goswami

న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రస్తుత క్రికెట్ రంగంలో ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత పది ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ మజా మహిళా క్రికెట్ లో కూడా రానుంది. 2018 నుంచి మహిళల ఐపీఎల్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ‘వచ్చే ఏడాది ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ను చూడొచ్చు’ అని సీవోఏ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘భవిష్యత్తులో మహిళల క్రికెట్‌లో ఎన్నో మార్పులు చూస్తారు. వీలైనన్ని ఎక్కువ మ్యాచులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. డయానా ఎడుల్జి, మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామితో దీనిపై ఇప్పటికే చర్చించాం. సిరీస్‌ల నిర్వహణ కుదరకపోతే ఉమెన్స్‌ ఐపీఎల్‌ చూడొచ్చు’ అని వినోద్‌ రాయ్‌ తెలిపారు.