నాగ్పూర్, నవంబర్ 27 : భారత్ వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నాగ్పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భాగంగా, రెండో ఇన్నింగ్స్లో లహిరు గామేగ్ అవుట్ చేసిన అశ్విన్ మూడొందల వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో కూడా నాలుగు వికెట్లతో చక్కటి ప్రదర్శనను కనబరిచాడు. 54 మ్యాచ్ల్లో అశ్విన్ ఈ 300 మార్కును చేరాడు.ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ(56 మ్యాచ్లు) రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. అంతే కాకుండా టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఇండియా ఆరో స్పిన్నర్ అశ్విన్ నిలిచాడు. 300 టెస్ట్ వికెట్లు తీసిన ప్రపంచ 31వ బౌలర్గా అశ్విన్ రికార్డులోకి ఎక్కాడు. అలాగే, ఈ ఏడాది 50వ టెస్టు వికెట్ను కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకుని మరో మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్గా అశ్విన్ నిలిచాడు. వరుసగా మూడేళ్ల నుంచి ఏడాదికి 50కి పైగా వికెట్లను అశ్విన్ సాధిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఓవరాల్గా చూస్తే, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్వార్న్, శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ తరువాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా అశ్విన్ రికార్డుల్లో నిలిచాడు.