న్యూఢిల్లీ, నవంబర్ 08: 10 కోట్ల మంది కస్టమర్లు, 9,753 ఏటీఎంలు, 8,224 బీసీ అవుట్ లెట్లను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు కు గత కొంతకాలంగా పెరిగిపోతున్న నిరర్ధక ఆస్తులు మూలంగా రీక్యాపిటలైజేషన్ కోసం అవస్థలు ఎదుర్కుంటుంది. దీని మూలంగా వచ్చే ఏడాది లోగా నష్టాల్లో నడుస్తున్న 300 శాఖలను మూసివేయడం లేదా స్థానాలను మార్చడం చేయాలని నిర్ణయించినట్టు బ్యాంకు ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో గణనీయమైన పోటీ పెరిగి౦దని, నష్టాల్లోని శాఖలను లాభాల్లోకి నడిపించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం అభివృద్ధి, విస్తరణ వ్యూహాలను మార్చుకుంటున్నామని ఆయన అన్నారు. బ్యాంకు లావాదేవీల్లో డిజిటల్ విధానానికి ప్రాధాన్యత పెరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకు శాఖలను విలీనం చేసుకోవడం లేదా మూసివేయడం చేయవచ్చని, మరో ప్రాంతానికి తరలించేందుకైనా బ్యాంకుకు అధికారాలను కల్పిస్తూ, రిజర్వ్ బ్యాంకు నిర్ణయాన్ని ప్రకటించడం తమకు అనుకూలమని ఆయన అభిప్రాయపడ్డారు.