చెన్నై, నవంబర్ 06 : నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మోదీ తొలిసారి రాజకీయాలు వద్దని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ చెన్నైలో జరిగిన డైలీ తంతి పత్రిక 75వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఎప్పుడూ రాజకీయాలేనా ఇంకా చాలా ఉంది. ఈ దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మిగతా అంశాలపైనా దృష్టి సారించాలి అ౦టూ ప్రధాని మీడియాకు క్లాస్ ఇచ్చారు. మీడియా కూడా ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం మీడియా అంతా రాజకీయాల చుట్టే తిరుగుతో౦దని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రెస్ను నాలుగో స్తంభంగా పరిగణిస్తారు. మీడియా కచ్చితంగా ఓ శక్తే. అయితే దానిని దుర్వినియోగం చేయకూడదని మోదీ తెలిపారు. ప్రపంచం ఎదుర్కొ౦టున్న ప్రధాన సమస్యలైన వాతావరణ మార్పులు, ఆరోగ్య సమస్యలు, నీటి కొరత, వ్యవసాయంలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ మీడియాకు సూచించారు.