న్యూఢిల్లీ, అక్టోబర్ 09 : రైల్వేలో చాలాకాలంగా కొనసాగుతూ వస్తున్న అనేక సంప్రదాయాలు లోపాయికారీ అలవాట్లకు ముగింపు పలుకుతూ ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విలాసవంతమైన ప్రత్యేక రైలు పెట్టాలో ప్రయాణించడం మానుకుని సాధారణ స్లీపర్ క్లాస్ లేదా తృతీయ శ్రేణి ఏసీ బోగీలో ప్రయాణిస్తూ, ప్రయాణికుల కష్ట, నష్టాలూ తెలుసుకోవాలని సీనియర్ రైల్వే అధికారులకు ఇటీవల స్పష్టం చేశారు. రైల్వే బోర్డు సభ్యులు జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన అన్నారు. ఇంట్లో కార్యాలయాలు వీఐపీ సంస్కృతికి పూర్తిగా చరమగీతం పాడాల్సిందేనని గోయల్ తేల్చి చెప్పారు. అనేక మంది అధికారులు రైల్వేలో పని చేసే వంట వాళ్లను తమ ఇళ్లలో పనులకు దశాబ్దాలుగా వినియోగించుకుంటుండగా ఈ పద్ధతిని కూడా మార్చుకుని వారందరినీ వెంటనే విధులకు పంపించాలని స్పష్టం చేశారు.