న్యూఢిల్లీ, అక్టోబర్ 04 : ఆన్లైన్ రైలు టికెట్ల పై రుసుము మినహాయింపు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపు ప్రకటించిన రైల్వే శాఖ పలు మార్లు గడువు పొడగించింది. ముందు జూన్ చివరి వరకు ఆ తరువాత సెప్టెంబర్ చివరి వరకు ఈ పన్ను మినహాయింపు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఆన్లైన్ టికెట్ల పై సేవా రుసుము రూపంలో రూ.20నుంచి40 వరకు వసూలు చేసేవారు. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కోసం 2016 నవంబర్ 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు సేవా రుసుము వసూలు చేయకుండా రూ.184 కోట్ల ఆదాయాన్ని వదులుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.