చెన్నై, సెప్టెంబర్ 11 : అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ భర్త ఎం.నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన శరీరంలోని కొన్ని కీలక అవయవాలు దెబ్బ తినడంతో ఆయనను పెరుంబక్కమ్లోని గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. నటరాజన్ గత ఆరు నెలలుగా తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆయన మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కాలేయ మార్పిడి కూడా చేయాలని వైద్యులు స్పష్టం చేసారు. ప్రస్తుతం కాలేయ దాత కోసం ఎదురుచూస్తున్న ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి రోజు రోజుకు మరింత క్షీణించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. నటరాజన్ గత ఫిబ్రవరిలో కూడా శ్వాసకోశ సమస్యతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు.