న్యూఢిల్లీ : సెప్టెంబర్ 8 : భారత దేశ రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, మాజీ రక్షణ మంత్రి జైట్లీ, నిర్మల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ మేరకు ఆమెకు అరుణ్ జైట్లీ బాధ్యతలను అప్పగించారు. ‘మేక్ ఇన్ ఇండియా’అనే నినాదాన్ని రక్షణ శాఖలో అమలు చేయడానికి, రక్షణ ఉత్పత్తులను దేశంలో తయారు చేయించడానికి కృషి చేస్తానని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మిలిటరీ బలగాలను సంసిద్ధం చేయించడం, రక్షణ ఒప్పందాల వేగవంతం చేయడం, సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తానని తెలిపారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మలా సీతారామన్ సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నుంచి రూ.13 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ నిధులను మాజీ సైనికులు, అమరుల భార్యలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు చెప్పారు.