న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : కేంద్ర కేబినేట్ పునర్వ్యవస్థీకరణ కోసం సర్వం సిద్దమైంది. మోదీ మంత్రివర్గంలోకి తీసుకునే కొత్త మంత్రుల వివరాలను ఈ రోజు పీఎంవో ప్రకటించనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరో ఐదుగురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. మోదీ మంత్రివర్గంలో ఈ సారి ఏకంగా 12 మంది నేతలను తీసుకోనున్నట్లు సమాచారం. మోదీ మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరు చేరతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం 10 గంటలకు ఆయా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా గుజరాత్, హిమాచల్ప్రదేశ్లకు కూడా అధిక ప్రాధాన్యం దక్కనున్నట్లు సమాచారం. వీరితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్, మురళీధర రావు, కిషన్ రెడ్డి ల పేర్లు కుడా ఈ జాబితాలో ఉంది. ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. అలా మొత్తం 12 మంది కొత్త మంత్రులు కేబినెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి ఈ విషయం పై ఇంకా స్పష్టత రానుంది.