మరోసారి రైలు ప్రమాదం

SMTV Desk 2017-08-29 14:27:40  

ముంబై, ఆగస్టు 29 : దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు కలవార పెట్టిస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదాన్ని మరువకముందే, ఈ ఉదయం నాగ్ పూర్, ముంబై దురొంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఇంజన్ తో పాటు 9 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆసాన్‌గావ్‌ రైల్వే స్టేషన్ వద్ద ఉదయం 6.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించినట్లు మధ్య రైల్వే అధికారి ప్రతినిధి సునీల్ ఉదయ్ తెలిపారు. కొండ చరియాలు విరిగిపడటం వలనే రైలు పట్టాలు తప్పినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పునఃరుద్దరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. బోగిల్లో చిక్కుకున్న ప్రయాణీకులను బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గత పది రోజుల్లో ఇది మూడో రైలు ప్రమాదం. ఈ నెల 19న ఉప్పల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందగా, 25వ తేదీన ముంబైలోని ఓ లోకల్ ట్రైన్ పట్టాలు తప్పగా ఆరుగురు గాయాలపాలయ్యారు.