ఢిల్లీ భావన నియోజకవర్గ ఉపఎన్నికలో ఆప్ ఘన విజయం

SMTV Desk 2017-08-28 19:18:07  Delhi, Bawana By Election, Aam Aadmi Party, Ram Chandra

ఢిల్లీ, ఆగస్ట్ 28: ఢిల్లీలోని భావన నియోజకవర్గానికి ఈ నెల‌ 23న జ‌రిగిన‌ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రామ్‌ చంద్ర ఘన విజ‌యం సాధించారు. కాగా, ఈ ఎన్నికలో ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వేద్‌ ప్రకాశ్‌పై 22 వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీని ఆమ్ ఆద్మీ నేత కైవసం చేసుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే, ఆప్ నేత‌ వేద్‌ ప్రకాశ్ బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేసిన కారణంగా ఇక్కడ ఉపఎన్నికల శంఖం పూరించారు. దీంతో ఈ ఎన్నికలో వేద్‌ ప్రకాశ్ బీజేపీ నుండి బరిలో నిలిచారు. తొలి రౌండ్‌ నుంచి స్వల్ఫ ఆధిక్యంలో ముందంజలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి సురేంద్ర కుమార్‌ 12 రౌండో తర్వాత అనూహ్యంగా వెనకబడిపోయారు. క్రమక్రమంగా మెజార్టీ పెంచుకుంటూ పోయిన ఆప్‌ పార్టీ అభ్యర్థి చివరకు 56,178 ఓట్లు సాధించి బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు. ఇక మూడో స్థానానికి పరిమితమవుతుందని భావించిన బీజేపీ అభ్యర్థి వేద ప్రకాశ్‌ చివరకు 34 వేల 501 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. గెలుపు మీద గంపెడు ఆశలు పెంచుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌కుమార్‌ 30,758 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.