చండీఘడ్, ఆగస్ట్ 28 : డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మహిళా సాధ్విలపై అత్యాచారం చేశారన్న కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపధ్యంలో నేడు గుర్మీత్ సింగ్ బాబాకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుండగా హర్యానా ప్రాంతంలో హైఅలర్ట్ ను ప్రకటించారు. నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడమే కాక, రేపటి వరకు ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధం కొనసాగనుంది. బాబా అనుచరులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసేందుకు కాల్పులకు కూడా వెనుకాడబోమని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బాబాకు జైలులోనే శిక్ష ఖరారు చేయడం మేలని భావించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్లో నేరుగా రోహ్తక్ జైలుకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా, శిక్ష వెల్లడించిన అనంతరం హర్యానాలో మరింత హింస చెలరేగే అవకాశాలుండడంతో ఇంటెలిజెన్స్ అధికారులు.. అత్యవసరమైన పనులుంటే తప్ప బయటి వారు ఎవరూ నేడు జిల్లాకు రావొద్దని, ఒకవేళ వచ్చిన వారి గుర్తింపుకార్డులను, స్పష్టమైన కారణాలను చెప్పాలన్నారు. లేదంటే వారిని అరెస్టు చేస్తామని డిప్యూటీ కమీషనర్ అతుల్ కుమార్ తెలిపారు.