చండీఘడ్, ఆగస్ట్ 26 : అత్యాచారం కేసులో బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దోషి అంటూ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించినప్పటి నుంచి పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో హింసాకాండ మరింత చెలరేగిపోతుంది. అయితే అక్కడి శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని పంచకులలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆ ప్రాంత డీసీపీ అశోక్కుమార్ ప్రకటించారు. అయితే ఆయన ఆదేశాల్లో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అల్లర్లు మరింత చెలరేగాయి. అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి 144 సెక్షన్ అమలు పరిచినప్పుడు అక్కడ ఎవరైనా ఆయుధాలతో సంచరించినా, నలుగురైదుగురు గుమిగూడి కనిపించినా చర్యలు తీసుకు౦టారు. కాని డీసీపీ అశోక్ కుమార్.. ఆయుధాలతో కనిపిస్తే మాత్రమే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ఈ హింస మరింత ఎక్కువైందని భావించిన హర్యానా పోలీసు శాఖ డీసీపీని సస్పెండ్ చేసింది. ఇంకా అక్కడ మాత్రం ఇంకా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికి 31 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.