మరి కొన్నిరోజుల్లో ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ రాష్ట్రపరిస్థితిని మోదీకి వివరించారు.
జగన్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవే...రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల, పోలవరం ప్రాజెక్ట్ కు సహకారం, అదనపు నిధుల మంజూరు, రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం మేజర్ పోర్టు ఏర్పాటు, ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు. కాగా, జగన్ మాట్లాడుతున్నంత సేపు ఓపికగా విన్న మోదీ సానుకూలంగా స్పందించారు.
"మీ పదవీకాలంలో మేం చేయగలిగినంత మేర సహాయం చేస్తాం. ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో తోడ్పాటునందిస్తాం" అంటూ హామీ ఇచ్చారు.