కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని మెట్రోరైల్వేస్టేషనులోకి వచ్చేందుకు ఓ అనుమానాస్పద ఉగ్రవాది యత్నించిన ఘటన కలకలం రేపింది. మెట్రో రైల్వేస్టేషను లోపలకు వచ్చేందుకు యత్నించిన ఉగ్రవాది మెటల్ డిటెక్టరు వద్దకు రాగానే అతని వద్ద మందుగుండు సామాగ్రి ఉండటంతో బీప్ సౌండ్ వచ్చింది. దీంతో అనుమానాస్పద వ్యక్తిని ఆపిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రశ్నించేందుకు యత్నిస్తుండగా, అంతలో అతను పారిపోయాడు.
మెట్రోరైలు సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో బెంగళూరు డీసీపీ సహా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు జరిపారు. మెట్రోరైల్వేస్టేషన్లలో పోలీసు భద్రతను పెంచడంతోపాటు ఈ ఘటనపై డీసీపీ దర్యాప్తునకు ఆదేశించారు. బెంగళూరు మెట్రో స్టేషనులో అనుమానాస్పద ఉగ్రవాది పేల్చేందుకు వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. పారిపోయిన అనుమానాస్పద వ్యక్తి జాడ కోసం గాలింపు చేపట్టారు