ఎన్నికలు రాగానే శ్రీరాముడు బీజేపీ ఎన్నికల ఏజెంట్‌గా మారిపోతారా?

SMTV Desk 2019-05-08 11:47:10  Modi, Mamata

భారత దేశమంతా సార్వత్రిక ఎన్నికల సందడి నడుస్తోంది. ఈ క్రమంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు .. ఉత్తర భారతమంతా మోదీ వర్సెస్ రాహుల్ కోణంలో ప్రచారం జరుగుతుంటే.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మోదీ వెర్సస్ మమతా బెనర్జీ పోరు నడుస్తోంది. ఇటీవల ఒక ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ..‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసే వారిని మమతా బెనర్జీ అరెస్టు చేయించి.. జైల్లో పెడుతున్నారని.. ‘జై శ్రీరాం’ అని అంటే తనను కూడా అరెస్టు చేయిస్తారా అని సవాలు విసిరారు.

మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ‘జై శ్రీరామ్’ అంటుంటారు కానీ ఒక్క రామ మందిరమైనా నిర్మించారా అని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీని ఉద్దేశించి.. బీజేపీ బాబు.. మీరు తరుచూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తుంటారు. కానీ ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక్క రామ మందిరమైనా కట్టించారా? అని ప్రశ్నించారు. ‘జై శ్రీరాం’ అనేది బీజేపీ నినాదంగా మారిపోయిందని, బీజేపీ నినాదాలను మేమెందుకు పాటించాలి? అడిగారు. ఎన్నికలు రాగానే శ్రీరాముడు బీజేపీ ఎన్నికల ఏజెంట్‌గా మారిపోతారా? ప్రతి ఒక్కరూ దాన్నే నినదించేలా వారు ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.