బెంగళూరు: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సీజన్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైన పని. అయితే, ఈ విషయంలో గొప్పతనం మొత్తం జట్టు యాజమాన్యానిదే. ఓటములు ఎదురవుతున్నా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. అనుకున్న స్థానంలో టోర్నీని ముగించలేకపోయినప్పటికీ రెండో అర్ధబాగాన్ని చూస్తే మాత్రం టోర్నీలో మా ప్రదర్శన బాగానే ఉందన్న భావన కలిగింది. చివరి 7 మ్యాచుల్లో మేం 5 విజయాలు సాధించాం. ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఈ విషయంలో మేం జట్టుగా గర్వపడుతున్నాం అని కోహ్లీ పేర్కొన్నాడు.