న్యూఢిల్లీ: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీల ఖాతాలు ఒకవేళ డిఫాల్ట్ అయితే వాటిని ఎన్పిఎలు(నిరర్థక ఆస్తులు)గా పరిగనించేందుకు బ్యాంకులకు ఎన్సిఎల్ఎటి(నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) గ్రూప్, దీనికి చెందిన 300 సంస్థల ఖాతాలపై బ్యాంకు నిర్ణయాలపై ఆంక్షలను బెంచ్ ఎత్తివేసింది. అయితే చైర్మన్ జస్టిస్ ఎస్జె ముఖోపాధాయ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఐఎల్ఎఫ్ఎస్ ఖాతాలను మొండి బకాయిలుగా నిర్థారించాలని, అయితే రికవరీ ప్రక్రియ చేపట్టొద్దని ట్రిబ్యునల్ పేర్కొంది. గ్రూప్నకు పరిష్కా రం చూపేంతవరకు రుణ సంస్థలు మద్దతును ఉపసంహరించుకోవద్దని బెంచ్ సూచించింది. కాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు మొత్తంగా రూ.90 వేల కోట్ల అప్పులను కల్గి ఉండగా, వీటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.