నాలుగు రోజుల పాటు కోస్తాను వణికించిన ఫణి తుఫాను ఎట్టకేలకు తీరాన్ని దాటింది. శుక్రవారం ఉదయం ఒడిషాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలోమీటర్ల వేగంతో కోల్కతా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా ఫణి పయనిస్తోంది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో సుమారు 200 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. కాగా బంగ్లాదేశ్ కన్నా ఫణి తుఫాను కోల్కతాను తాకే అవకాశం ఉండటంతో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది. మరోవైపు బంగ్లాదేశ్ తీరాన్ని తాకేలోపు ఫణి తుఫాను బలహీనపడనుందని వాతావరణశాఖ తెలిపింది. బాలాసోర్ వద్ద ఈ తుఫాన్ మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలపై అంచనా వేస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది.