పీఎం ఎస్‌వైఎంతో నెలకు రూ.3,000 పెన్షన్!

SMTV Desk 2019-05-02 13:50:32  pm sym scheme, employees pension

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం ఎస్‌వైఎం) అనే స్కీమ్‌ ను ప్రవేశపెట్టింది. దీంతో నెల ఆదాయం రూ.15,000లోపు ఉన్నవారు అలాగే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న సమయంలో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. తరువాత 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. అయితే స్కీమ్‌లో చేరే వ్యక్తి ఎన్‌పీఎస్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఈపీఎఫ్‌వో స్కీమ్‌లలో చేరి ఉండకూడదు. పీఎం ఎస్‌వైఎం స్కీమ్‌లో చేరాలని భావించే వారు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చు. నెలకు కొంత మొత్తం చొప్పున 60 ఏళ్లు వచ్చేంత వరకు కట్టాలి. తర్వాత సబ్‌స్క్రైబర్ నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ సబ్‌స్క్రైబర్ చనిపోతే పెన్షన్‌లో సగం భాగం భాగస్వామికి వస్తుంది. ఇంటి పనులు చేసేవారు, వీధి కార్మికులు, ఇటుకల తయారీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ పనులు చేసేవారు ఇలా ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ కచ్చితంగా కావాలి. ఆదాయ పత్రం అవసరం లేదు. స్వీయ ధ్రువీకరణతో స్కీమ్‌లో చేరవచ్చు. తప్పుడు సమాచారం అందిస్తే పెనాల్టీలు చెల్లించాలి. ఆటో డెబిట్ సౌకర్యం ఉంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించొచ్చు. ఎంత చెల్లించాలనేది వయసు ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు చెల్లిస్తుంది. రెండు కలిపి మీ స్కీమ్‌లో జమవుతాయి. మీకు 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.55 కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.55 జమ చేస్తుంది. అదే మీకు 25 ఏళ్ల ఉంటే నెలకు రూ.80 చెల్లించాలి. 30 ఏళ్ల ఉంటే రూ.105, 35 ఏళ్ల ఉంటే రూ.150 చెల్లించాలి.