శ్రీ నగర్, మే 01: నేటి సాంకేతిక యుగంలో దేన్నైనా హ్యాక్ చేయడం సులభతరం అయిపోయింది సైబర్ నేరగాళ్లకు. వారి అవసరాల నిమిత్తం ఎంతటి పని చేయడానికయినా వారు వెనకాడటం లేదు. గవర్నమెంట్, ప్రైవేట్ అనే తేడా లేకుండా కావాల్సింది కావలసినట్టు సంచారం దోచేస్తున్నారు. ఈ తరహా పరిణామమే చోటు చేసుకుంది జమ్మూ కాశ్మీర్ లో......
ఇప్పటివరకూ ప్రభుత్వ, రక్షణశాఖకు చెందిన వెబ్ సైట్లే హ్యాకింగ్ కు గురవ్వడాన్ని చూశాం. తాజాగా జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పైనా హ్యాకర్లు పంజా విసిరారు. ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంతరం ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఫాలో అవుతున్నట్లు చూపించారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ భవన్ వర్గాలు అవసరమైన చర్యలు చేపట్టాయి. అకౌంట్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాయి. ఈ విషయమై రాజ్ భవన్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. హ్యాకింగ్ వ్యవహరంలో చర్యలు తీసుకోవాల్సిందిగా జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.