సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రముక క్రీడాకారుడు , కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతు సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓడిపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన సిద్ధూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. జాతీయవాదం అంటే ఏమిటో యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ నుంచి నేర్చుకోవాలన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓటమికి రఫేల్ యుద్ధ విమానాల వివాదం ప్రధాన కారణం అవుతుందని విమర్శించారు. యూపీలోని కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీ నుంచి రాహుల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ బరిలోకి దిగారు. ఇక అమేఠీలో గత ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓటమిపాలైన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ సారి రాహుల్, స్మృతి మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.