నిన్నే పెళ్లాడుతా, ఇడియట్, శివమణి, అల్లరి రాముడు వంటి సినిమాలతో, టీవీ సీరియళ్లతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు సుభాష్ చంద్రబోస్ కన్నుమూశారు. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్లో కనిపించిన ఈయన కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు మూడు దశాబ్ధలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సుమన్ హీరోగా తెరకెక్కిన సాహసపుత్రుడు సినిమాతో తెరకు పరిచయం అయిన బోస్కు ప్రేమఖైదీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆయన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణానగర్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాంతో తలకు బలమైన గాయాలు తగిలాయి. బోస్ అప్పటినుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ, తలకు తగిలిన దెబ్బలు తీవ్రమైనవి కావడంతో ప్రాణాలు విడిచారు. బోస్ మరణంతో సినీ, టీవీ రంగాల్లో విషాదం నెలకొంది.