కోల్కతా: కోల్కతా నైట్రైడర్స్(కెకెఆర్) డ్యాషింగ్ బ్యాట్స్మన్ ఆండ్రీ రస్సెల్ జట్టు యాజమాన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెకెఆర్ వరుస ఓటములపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రస్సెల్ జట్టు వరుస పరాజయాలకు చెత్త నిర్ణయాలే కారణమన్నాడు. అసలు జట్టులో వాతావరణమే సరిగా లేదని తెలిపాడు. ముంబయి ఇండియన్స్ తో ఆదివారం జరిగే మ్యాచ్కు ముందు రస్సెల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మాది మంచి జట్టే కానీ చెత్త నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే వరుసగా ఓడిపోతామని చెప్పిన ఆండ్రీ సరైన సమయంలో సరైన బౌలర్ను బౌలింగ్కు దించకపోవడమే తమ జట్టు పరాజయాలకు కారణమని దుయ్యబట్టాడు. బ్యాటింగ్లో బలహీనంగా ఉన్న రాజస్థాన్ తో మ్యాచ్లోనూ తాము ఓడిపోవడంపై ఆండ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమకున్న బౌలింగ్ వనరులతో ఏ జట్టునైనా 170 పరుగులకే పరిమితం చేయాలి.. లేకపోతే ముంబయి లాంటి పటిష్టమైన జట్టుపై గెలవాలంటే అద్భుతం జరగాల్సిందేనని పేర్కొన్నాడు. తాము బ్యాటింగ్లో విఫలమవుతున్నామని వారు చెబుతున్నారు. అది నిజంకాదు. రక్షించుకోగల స్కోర్లనే మేం చేస్తున్నాం. కానీ మా బౌలర్లు అత్యంత దారుణంగా విఫలమవుతున్నారని, దీనికి తోడు ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదని, విలువైన సమయాల్లో సులువైన క్యాచ్లు కూడా పట్టలేకపోతున్నాం. ఈ ఐపిఎల్ సీజన్ లో మాదే చెత్త ఫీల్డింగ్ అని రస్సెల్ వాపోయాడు. అసలు జట్టులో వాతావరణమే సరిగా లేదని అందుకే తాను హోటల్ రూంకే పరిమితమవుతున్నానని చెప్పుకొచ్చాడు.