మాండ్య: ప్రముఖ సినీ నటి సుమలత కర్ణాటకలోని మాండ్య లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం ఆమె ప్రచారం చేస్తుండగా అక్కడ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలో మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ల కార్యకర్తలు కలిసి సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థిని పోటీలోకి దించకుండా ఆమెకు మద్దతు తెలుపుతుండగా.. అంబరీశ్పై అభిమానంతో సుమలత విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్, జనతాదళ్ కార్యకర్తలు, నాయకులు అనేకమంది తమ పార్టీల జెండాలు పట్టుకుని మరీ ఆమె ప్రచార ర్యాలీలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల ముఖ్యనాయకుల హెచ్చరికలను తోసిపుచ్చుతూ పలువురు నాయకులు, కార్యకర్తలు బాహాటంగా సుమలత ప్రచారంలో పాల్గొంటుండడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.