సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇక మనకు విద్యుత్ కష్టాలు ఉండవని తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. దేశంలో అత్యధిక తలసరి విద్యుత్ వాడుకునే ప్రథమ రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. జూన్ మాసం తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తెస్తామన్నారు. ఒక్కొక్క గుంట లెక్కతేలేలా రైతులకు పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే నుంచి రూ. 2 వేలు పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు పింఛను ఇచ్చి ఆదుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ లాంటిది. గిరిజనుల పోడు భూముల సమస్యలు పరిష్కారం కావాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే ప్రాంత, మత సమస్యలు లేవనెత్తుతున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. ప్రచార హోరులో కొట్టుకు పోవద్దని యువతకు కేసీఆర్ సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏడాది తెలంగాణలో 30 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. కేంద్ర బడ్జెట్ కంటే రూ.3 లక్షల కోట్లు ఎక్కువగా ఖర్చు చేయనున్నాం’ అని కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే వస్తుందని, తెలంగాణ మాత్రమే కాకుండా దేశం కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి నగేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.