ముంబయి : బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. జపాన్లోని క్యోటో ఎయిర్పోర్ట్లో తాను చిరంజీవి కలిసినట్టు ఆమీర్ ఖాన్ తెలిపారు. చిరుతో కలిసి దిగిన ఫొటోను ఆమిర్ ఖాన్ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ‘తన అభిమాన నటుల్లో ఒకరైన చిరంజీవిని క్యోటో ఎయిర్పోర్ట్లో కలిసినందుకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిరుతో చర్చించానని, చిరు తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆమీర్ ఖాన్ పేర్కొన్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం జపాన్లో జరుగుతోంది. చిరంజీవి తన కుటుంబంతో కలిసి అక్కడే విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చివరి షెడ్యూల్ ఇదేనని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.