శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. భద్రతా బలగాలు రావడం గమనించిన ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన రక్షణదళాలు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. ఎదురు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో 2 ఎకె 47 రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్ ఇండియన్ ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.