దేశ ప్రధాని నరేంద్ర మోడీ మోసగాడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి అన్నారు. విశాఖలో టీడీపీ ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. తన ప్రసంగంలో మమత బెనర్జి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో చాయ్ వాలాను నమ్మి మోసపోయామని, గత ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేయడం మన దురదృష్టమని మమత అన్నారు. అబధ్ధాలతో మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని ఆమె ఆరోపించారు. తెలుగు లో ప్రసంగం ప్రారంభించిన మమతా సుందర విశాఖ నగరమంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. “మోడీ ఒక మోసగాడు. ఆయన అవసరం దేశానికి లేదు. అతడిని గద్దె దించాల్సిన అవసరం వచ్చింది. దేశం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి నేను సిద్ధం. మోడీతో కలిసి ఉన్నవారిని కూడా ఓడించాలి. నా ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభిస్తున్నాను” అని మమత అన్నారు.
“నోట్ల రద్దుతో టెర్రరిజం నశిస్తుందన్నారు. కాని తీవ్రవాదం మరింత పెరిగిందని. పుల్వామ ఘటన నిదర్శనం. పుల్వామ ఘటనను కూడా మోడీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మమతా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేయాలనన్నారు. పుల్వామ ఘటన జరిగిన తరువాత మోడీ ఇంతవరకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని మమతా కోరారు. మోడీ హటావో, దేశ్కొ బచావో అని మమత తన ప్రసంగాన్ని ముగించారు.