చండీగఢ్, మార్చ్ 26: భారత వాయుసేనలోకి నాలుగు భారీ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. సోమవారం ఐఎఎఫ్ 126 హెలికాప్టర్ విభాగంలో జరిగిన కార్యక్రమంలో వైమానిక దళ అధిపతి బిఎస్ ధనోవా ఈ చోపర్లు బలగంలోకి చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 15 సిహెచ్ 47 ఎఫ్ (i) చినూక్ హెలికాప్టర్ల నిర్వహణకు 12 మంది భారతీయ వాయుదళ పైలట్లు, ప్లయిట్ ఇంజనీర్లు అమెరికాలో తగు ప్రత్యేక శిక్షణను పొందారు. అతి ఎక్కువ బరువును తీసుకువవెళ్లగలిగే ఈ హెవీ లిఫ్టర్ హెలికాప్టర్లు భారతీయ వాయుసేనకు ఇప్పుడు అదనపు బలాన్ని చేకూర్చుతాయి. బోయింగ్ సంస్థ నుంచి వీటిని తెప్పించుకునేందుకు 2015 సెప్టెంబర్లో రంగం సిద్ధం అయింది. మొత్తం 15 హెలికాప్టర్ల కోసం ఆర్డర్లు పంపించారు. వీటిలో తొలి నాలుగు ఇప్పుడు భారతీయ వాయుసేన సేవలకు సిద్ధం అయ్యాయి. రాఫెల్ ఏ విధంగా అయితే వాయుసేన పాటవాన్ని ఇనుమడింపచస్తుందో , అదే విధంగా ఈ హెలికాప్టర్లు కూడా తమ సామర్థతను చాటుకుంటాయని ధనోవా దీమా వ్యక్తం చేశారు.