ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన కల్యాణ్ సింగ్, నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కావాలంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఎలా మాట్లాడుతారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఈ వివాదంపై స్పందించిన రాష్ట్రపతి భవన్.. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ఒక్కరూ ప్రచారం చేయొద్దంటూ వ్యాఖ్యానించింది.
అయితే సుదీర్ఘకాం బీజేపీలో పనిచేసిన కల్యాణ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా పదవిలో ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఖరారు చేసిన స్థానిక అభ్యర్థి ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని కొంతమంది బీజేపీ కార్యకర్తలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాంటి వారికి ఎలా మద్దతు ఇవ్వగలమని ఆయనకు విన్నవించుకున్నారు. దీనిపై మాట్లాడిన కల్యాణ్ సింగ్.. ‘‘నేను బీజేపీ కార్యకర్తనే. బీజేపీ కార్యకర్తలుగా ఆ పార్టీనే గెలవాలని కచ్చితంగా కోరుకుంటా. ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటున్నారు. తిరిగి మోదీయే ప్రధాని కావాలనుకుంటున్నారు. ఆయన ప్రధాని కావడం దేశానికి, సమాజానికి ఎంతో అవసరం’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.