దేశ ప్రధాని మోదీ హిట్లర్ దారిలో నడుస్తున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. హరియాణాలోని గురుగ్రామ్లో ఓ ముస్లిం కుటుంబంపై కొంత మంది దాడి చేశారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతోంది? ఏ రామాయణంలో రాసుంది?’ అని ఘాటుగా ప్రశ్నించారు.
‘హిట్లర్ పాలనలో గూండాలు అమాయక ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారు. హింసించి చంపేవారు. అక్రమ కేసులు పెట్టి ప్రజలకు కంటి మీద మనశ్శాంతి లేకుండా చేసేవారు. మోదీ కూడా హిట్లర్ పాలనా విధానాన్నే అనుసరిస్తున్నారు. అధికారం కోసం హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మోదీ అనుచరులకు అర్థం కావడం లేదు’ అని ట్వీట్ చేశారు కేజ్రీవాల్.