న్యూఢిల్లీ, మార్చ్ 23: భారత దేశపు మొట్టమొదటి లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో శనివారం ఆయనతో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఘోష్ 2017లో రిటైర్ అయ్యి ప్రస్తుతం జాతీయ మానవహక్కుల కమిషన్లో సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి, మాజీ ప్రధానులపై అవినీతి ఆరోపణలు వస్తే వారిని కూడా విచారించే అధికారం లోక్ పాల్ కు ఉంటుంది. కేంద్రమంత్రులు, ఎంపిలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విదేశాల నుంచి ఏడాదికి రూ.10లక్షల కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకునే వ్యక్తులు, సంస్థలను కూడా ప్రశ్నించే అధికారం లోక్పాల్కు ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో కలిసి లోక్పాల్ విధులు నిర్వహిస్తుంది.